

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఆశిష్ కుమార్ దాస్ను నియమించింది. ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్ రెండో విడత పదవీకాలం 2027 మార్చి 31తో ముగియనుండగా, 2027 ఏప్రిల్ 1 నుంచి ఆశిష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇన్ఫోసిస్లో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన ప్రస్తుతం డైవర్స్ బిజినెస్ పోర్ట్ఫోలియో గ్లోబల్ హెడ్గా, సస్టెయినబిలిటీ బిజినెస్ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఐఐటీ ఖరగ్పూర్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆశిష్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ బిజినెస్ స్కూల్లలో నాయకత్వ శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు.
సలీల్ పరేఖ్ నాయకత్వంలో ఇన్ఫోసిస్ డిజిటల్, ఏఐ రంగాల్లో విస్తరించి ఆదాయాన్ని 10 బిలియన్ డాలర్ల నుంచి 20 బిలియన్ డాలర్లకు పెంచింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.7,769 కోట్లకు చేరగా, ఆదాయం 14 శాతం పెరిగి రూ.48,211 కోట్లుగా నమోదైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాను 1.5–3 శాతానికి తగ్గించిన సంస్థ, నిర్వహణ మార్జిన్ను 20–22 శాతం వద్ద కొనసాగించింది. అక్టోబర్, జనవరిలో వేతన పెంపులు అమలు చేయనున్నట్లు ప్రకటించిన ఇన్ఫోసిస్, ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది క్యాంపస్ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 80,000 మంది ఉద్యోగులు ఏఐ కోడింగ్ టూల్స్ను వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.













Comments (0)
No comments yet
Be the first to comment!